Description
చివరకు మిగిలేది
ఈ నవల గురించి
చివరకు మిగిలేది – ఏమిటి? అన్నదానికి వెంటనే దేని చివరకు ? అన్న ప్రశ్న పుడుతుంది. ఆ వెంటనే మిగిలేది ఎవరికి? అన్న జిజ్ఞాసా రాక తప్పదు. వ్యక్తికా -జీవితానికా వ్యక్తులతోనూ వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పత్తి, పునరుత్పత్తి సంబంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా అన్నదే అది. ఈప్రశ్న భావనామయమైంది. దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా?
అసలీ “మిగలటం” – అన్న సమస్య గురించి విశ్వనాథ వేయిపడగలలో చర్చించాడు. అలాగే చలం తన మ్యూజింగ్స్ లో కొంత ఆలోచన చేశాడు. ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథఅంటే, మిగులుతుందనుకోటం భ్రమగా తేల్చేశాడు చలం.
వీరి తాత్త్విక విశ్వాసాలకు నృజనాత్మకరూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది. రెండు ప్రపంచయుద్దాల మద్య కొత్త విలువలు రూపుకడ్తున్నాయి. నిరాశా నిస్పృహల్లో మునిగిన సమాజాన్ని “లోచూపు”లో చూడటం అన్న వాస్తవికతలకు నవలారూపమే ఈ రచన.
పురుష స్వామ్యసామాజిక భావజాలం అది సృష్టించిన పాత్రలు- వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడుంది. ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య- సామాజిక తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్ రసెల్ జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్త్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది.
ఆధునిక తెలుగు నవలల్లో మంచి వేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేదీ: తెలుగు కల్పనాసాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది”
బుచ్చిబాబు

